కుజదోష నివారిణి అపర్ణాదేవి - Mangal dosha Remedies

ఓ మహాత్మా! అపర్ణా వ్రతమును ఏ విధముగా చేయవలెను, అందుకు విశేషమైనటువంటి పర్వదినములు ఏమైనా కలవా? ఈ వ్రతమునందు ఏ దేవతను పూజింపవలయును? ఏ విధముగా పూజ చేయవలయును? ఈ వ్రతము చేసిన వచ్చు ఫలమేమి? అని ఋషులు కోరగా సూతమహర్షి ఈ విధముగా చెప్పుచున్నాడు. శ్రీ అపర్ణా వ్రతము చేయు మానవులు ముందుగా విఘ్నేశ్వర పూజను ఆచరించి, మండపమును ఏర్పరిచి, కలశయందు వరుణదేవుని పూజించి, ప్రతిమారూపిణిగా అపర్ణాదేవిని పూజింపవలెను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు వైదికముగాను, శూద్రులు పురాణోక్తముగాను, ఈ కల్పములో చెప్పబడిన విధముగా పూజించి ప్రత్యేకముగా క్షీరాన్నము నివేదన గావించి, పూజ పూర్తిచేసి శ్రీ అపర్ణా వృత్తాంతము, కుజ జన్మ వృత్తాంతమును పఠింపవలెను. ఈ ప్రకారము చైత్ర మాసములో కాని, శ్రావణ, ఆశ్వీయుజ, కార్తీక, మాఘ మాసములందు గాని, ఈ వ్రతమును ఆచరించవలెను.
ముఖ్యముగా ఈ వ్రతమును ఆచరించు భక్తులు ఏ మాసముల యందైనను మంగళ, శుక్రవారముల యందు శ్రీ అపర్ణాదేవిని పూజించుట విశేషము. కుజదోషము ఉన్న వివాహము కాని వారు, సంతానము లేనివారు మంగళవారము పూజించుట విశేషము. మరియు ఋణ, శత్రుబాధల నుండి విముక్తి కొఱకు మంగళవారము పూజింపవలెను.
మంగళ లేక శుక్రవారం: 
అపర్ణా అమ్మవారి ఆలయం ఆంధ్రప్రదేశ్‌లో తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి అను గ్రామములో కలదు. ఈ గ్రామం అన్నవరం పుణ్యక్షేత్రానికి 20 కి.మీ దూరంలో, సామర్లకోటకు 25 కి.మీ దూరంలో, కాకినాడకు 30 కి.మీ దూరంలో కలదు. శ్రీ అపర్ణాదేవిని శుక్రవారము పూజించినచో విద్యార్ధులకు విద్యాలాభము, వ్యాపారులకు ధనలాభము, స్త్రీలకు సౌభాగ్య సంపదలను, పురుషులకు సకల కార్యసిద్ధిని చేకూర్చును. ఈ వ్రతమును ఏడు మంగళవారములు గాని, ఏడు శుక్రవారములు గాని పూర్తిచేసి ఏడుగురు ముత్తైదువులకు వస్త్ర, దక్షిణ తాంబూలాదులు, శ్రీ అపర్ణా వ్రతకల్ప పుస్తకముతో వాయనమిచ్చి వారిచే ఆశీర్వచనము పొందవలెను. ముఖ్యముగా ఈ వ్రతము ఆచరించువారు ప్రారంభమునందు గాని, మధ్యలో గాని, చివరివారము నందు గాని, తాళ్లపురం(తాటిపర్తి)లో వేంచేసియున్న అపర్ణాదేవిని సందర్శించి, పూజించుకొనవలెను. ఈ ప్రకారము శ్రద్ధ, భక్తి విశ్వాసములతో ఎవరు ఈ వ్రతమును ఆచరిస్తారో వారికి అపర్ణాదేవి అనుగ్రహముచేత సకల కార్యములు సిద్ధించుటయే గాక, బ్రతికియున్నంత కాలము ధనము, పుత్రపౌత్రికలు కలిగి సమస్తమైన ఐశ్వర్యములను అనుభవించి అంత్యమున దేవి సాన్నిధ్యము పొందుదురు. కలియుగమున వాంఛసిద్ధి కలిగించుటకు, కుజదోష నివృత్తికి ఇంతకంటే సులభమైన వ్రతము మరొకటి లేదని సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పెను.శ్రీ అపర్ణాదేవి అమ్మవారి వ్రతమును ఈ క్రింది కారణాల కోసం ఆలయములో కాని, ఇంటి వద్ద కాని చేసుకొనవచ్చును.

1. కుటుంబ సౌఖ్యము కొరకు (శుక్రవారం ఉ.10.30 గం. నుండి 12.00 గం. రాహుకాలమందు)
2. కుజగ్రహదోష నివృత్తికి, వివాహాలు కుదురుటకు (మంగళవారములయందు) 3. రాహు, కేతు గ్రహదోష నివృత్తికి (శుక్రవారం ఉ.10.30 గం. నుండి 12.00 గం. రాహుకాలమందు లేదా మంగళవారములయందు) 4. ఋణ బాధలు తొలగుటకు (మంగళవారములయందు) 5. ఉద్యోగం పొందుటకు, పదోన్నతులు, బదిలీలకు (అష్టమితో కూడిన మంగళవారమందు లేదా మంగళవారములయందు) 6. దాంపత్య సమస్యల నివృత్తికి, సంతానం కొరకు (శుక్రవారములయందు)
7. వ్యాపార వాణిజ్య విషయాలలో చిక్కులు తొలగి ఐశ్వర్యాభివృద్ధికి (శుక్రవారములయందు) 8. ఏ రంగం నందైనను విజయం సాధించడానికి (మంగళవారములయందు) 9. జ్ఞానసముపార్జనకు, తద్వారా మోక్షసాధనకు (శుక్రవారములయందు) చేసుకొనగలరు.
ఈ వ్రతమును ఏ మంగళ, శుక్రవారముల నందైనను జరుపుకొనవచ్చును. అష్టమి, చతుర్ధశితో కూడిన మంగళ, శుక్రవారములయందు చేసుకున్నచో విశేష ఫలప్రదము. మీ మీ సౌలభ్యములను బట్టి అమ్మ వారి దివ్యక్షేత్రము నందు ఈ పూజను జరిపించుకొనవచ్చును. మీ సమస్యను బట్టి ఏడు మంగళవారములు కాని, ఏడు శుక్రవారములు కాని ఈ వ్రతమును జరుపుకొనడము మంచిదిగా దైవజ్ఞులు నిర్ణయించారు. మీ ఇంటి దగ్గర అమ్మ వారి పూజను, దివ్యవ్రతమును జరుపుకొనవచ్చును, లేదా జరిపించుకొనవచ్చును. ప్రతీ మంగళవారము ఉదయం 6 గం. నుండి 12 గం. వరకు కుజగ్రహ దోష నివృత్తికి, వివాహాలు కుదరడానికి, మిగిలిన సమస్యలు నివారణకు అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు, ప్రతీ శుక్రవారము ఉదయం 6 గం. నుండి 10.30 గం. వరకు కుంకుమార్చనలు, 10.30 గం. నుండి 12 గం. ల మధ్య రాహుకాలమందు అమ్మవారికి విశేష కుంకుమార్చనలు జరుగును. ప్రతీ పౌర్ణమికి అమ్మవారికి పంచామృత అభిషేకములు, విశేష కుంకుమార్చనలు జరుగును. ప్రతీ సంవత్సరం ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు అమ్మవారికి నవరాత్రి మహోత్సవములు, కుంకుమార్చనలు జరుగును. ఫాల్గుణ శుద్ద సప్తమీనాడు శ్రీ అపర్ణా సమేత నాగేశ్వర స్వామి వారి కల్యాణం మరియు ఊరేగింపు జరుగును.
కుంకుమ పూజకు, వ్రతమునకు కావలసిన సామాగ్రి: 
పసుపు – 50 గ్రా., కుంకుమ – 200 గ్రా., తమలపాకులు – 9, పోక చెక్కలు – 5,
అరటి పండ్లు – 6, కొబ్బరి కాయలు – 2, ఎర్ర పూవులు, ఎర్ర వత్తులు, నెయ్య
హారతి కర్పూరం – 1/4 తులం , ఎర్ర జాకట్టు ముక్క -1, తువ్వాలు – 1, కలశానికు చెంబు – 1, చిల్లర కాసులు – 9, దీపం కుంది, గంధం, అక్షతలు, పంచపాత్ర, ఉద్దరిణి, అరివేణం, సాంబ్రాణి, ధూప్‌ స్టిక్‌, అగరవత్తులు – చిన్నకట్ట, మామిడి కొమ్మలు – 3
బియ్యం – 1 కేజీ (వినాయక పూజకు), క్షీరాన్నము (పరమాన్నము) లేక చలిమిడి, వడపప్పు, పానకం…
కుజుని వృత్తాంతం 
శ్రీ మహావిష్ణువు తన నాభికమలము నుండి బ్రహ్మను సృష్టించాడు. ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్షప్రజాపతి ఒకడు. దక్షుడు అనగా సమర్ధుడు అని అర్ధము. ఆ దక్షప్రజాపతి తన కుమార్తెలలో ఇరవైఏడు మందిని అశ్వని (నక్షత్రములు) మొదలగువారిని చంద్రునకు ఇచ్చి వివాహము చేసినాడు. ఒక కుమార్తెను పరమేశ్వరునకు ఇచ్చాడు. ఆమె దాక్షాయణి, శ్రీమాత. పరమశివుడు ప్రతీరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు. అందుకే ఆయనకు నటరాజు అనే పేరు వచ్చింది. ఆ నాట్యం చూడటానికి ముక్కోటి దేవతలు వస్తారు. దక్షుడు కూడా వచ్చేవాడు. దక్షుడు మామగారు ఐనప్పటినుండి శివుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షుని సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు. ఒకరోజు వీలులేక దేవతలందరినీ సాగనంపి చివరకు దక్షుని సాగనంపాడు. దాంతో కోపం వచ్చిన దక్షుడు ఓ పెద్దయజ్ఞం తలపెట్టి దానికి కుమార్తెను, అల్లుడిని పిలవలేదు. మరీచాది మహర్షులు హితబోధ చేయబోయారు. కానీ దక్షుడు వినలేదు. నారద మహర్షుల ద్వారా యజ్ఞకార్యాన్ని గురించి విన్న దాక్షాయణి పరమశివుని యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది.
శివుడు పిలవని పేరంటానికి వెళ్ళడం తగదంటూనే అనుమతి ఇచ్చాడు. ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రమథగణాన్ని పంపించాడు. దాక్షాయణి యజ్ఞశాలకు చేరింది. దక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెను (దాక్షాయణిని) చూసి దగ్గరకు వచ్చి పరమశివుని నిందించాడు. అతడు రాకపోతే నష్టం లేదు, నువ్వు వచ్చావు చాలా సంతోషం అన్నాడు. దాక్షాయణి తండ్రికి, అక్కడ ఉన్న దేవతలందరికి పరమశివుని గొప్పతనం చెప్పి, శివనింద చేసినవాని కుమార్తెగా ఉండకూడదని నిశ్చయించింది. యజ్ఞకుండము దగ్గరకి వెళ్ళి యోగాగ్నిచే దగ్థమైంది. ఆవార్త తెలిసిన శివుడు దక్షయజ్ఞమును ధ్వంసము చేసినాడు. పిమ్మట శివుడు కైలాసమునకు వెళ్ళి సతీవిరహమును పొందుచూ తిరిగి హిమవత్‌ పర్వతము నందు తపస్సు చేయుచుండెను. అటుల తపస్సు చేయుచుండిన శివుని మూడవ నేత్రమునుండి శ్వేద బిందువులు నేలపై పడి, ఒక శిశువు ఉద్భవించెను. ఆ బాలుడు ఎరన్రి కాంతితో దివ్య తేజస్సుతో నాలుగు భుజములతో ప్రకాశిస్తున్నాడు. దిక్కులు ప్రక్కటిల్లేలా ఏడవడం ప్రారంభిచాడు.
ఆ ధ్వనికి భూమి, ఆకాశము ఏకమవుతున్నట్లు ఉంది. ఇంతలో భూదేవి స్త్రీ రూపధారిణి అయి ఆబాలుడిని ఎత్తుకుని స్తన్యమిచ్చినది. శివుడు భూదేవితో నీవు చాలా పుణ్యాత్మురాలవు. నా శ్వేదబిందువు నీపై పడుటచే ఈ బాలుడు ఉద్భవించాడు. నేటి నుండి నీకుమారుడిగా ప్రసిద్ధి చెందుతాడు. ఇతడు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక, తాపత్రయరహితుడై నీ పేరుతో విఖ్యాతి పొందును, అని చెప్పాడు. శివలలాటజలము భూమిపై పడి ఇతడు జన్మించుటచే (కు-భూమి యందు, జ-జన్మించినవాడు) కుజుడు అని ప్రసిద్ధి నామం కలిగెను. భూమి కుమారుడు గాన భౌముడనియు, అగ్ని తేజస్సుచే పుట్టినవాడు (సర్వాంగములను పీడించువాడు) గాన అంగారకుడనియు ప్రసిద్ధి నొందెను. ఇతడు జన్మించిన కొన్ని క్షణములకే యువకుడై కాశీయందు ఉండి చిరకాలము శివుని గురించి తపస్సు చేసి శివానుగ్రహముచే గ్రహత్వమునొంది శుక్రలోకమునకు పైభాగమున ఉండెను. నాటి నుండి ఎవరు ఇతనిని పూజిస్తారో వారికి వెంటనే కుజదోష నివృత్తి, సర్వకామ్యసిద్ధి కలుగును. ఈ కుజ జన్మ వృత్తాంతము పరమ పావనమైనది. అని సూతుడు శౌనకాది మునులకు తెలిపెను. అపర్ణాదేవి వ్రతమాచరించినవారికి కుజదోష నివృత్తి కలుగును.

No comments:

Post a Comment