రావి చెట్టుని ఎందుకు పూజించాలి ? - how to worship Peepal Tree

* రావిచెట్టుని పూజిస్తే లక్ష్మీ కటాక్షం

సూత ప్రోక్తమైన విషయాలను విన్న ఋషులు ''ఓ మునిరాజా! రావిచెట్టు ఎందుకు అంటరానిది అయ్యింది? శనివారంనాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది? అని అడగ్గా సూతర్షి వారిని సమాధానపరిచాడు.

* రావిచెట్టు - దరిద్ర దేవత

పూర్వం క్షీరసాగర మధనంలో లభించిన అనేక వస్తువుల్లో లక్ష్మిని, కౌస్తుభాన్ని శ్రీహరికి సమర్పించి తక్కిన సంపదనంతా దేవతలు తీసుకున్నారు. శ్రీహరి, శ్రీదేవిని పెళ్ళి చేసుకోదలచాడు. కానీ శ్రీదేవి ''ఓ నారాయణా! నాకన్నా పెద్దది నా అక్కయ్య ఉన్నది. ఆ జ్యేష్ఠకు పెళ్ళి కాకుండా కనిష్ఠనైన నేను కల్యాణమాడటం న్యాయం కాదు కనుక ముందు ఆమె పెళ్ళికై సంకల్పించు'' అని కోరింది. ధర్మబద్ధమైన ''రమ'' మాటలను అంగీకరించి విష్ణువు ఉద్దాలకుడు అనే మునికి జ్యేష్ఠాదేవిని సమర్పించాడు. స్థూలవదన, అశుభకారిణి, అరుణనేత్రి, కఠినగాత్రి, బిరుసు శిరోజాలు కలిగిన జ్యేష్ఠాదేవిని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి తెచ్చుకున్నాడు.

* దరిద్ర దేవతకు ఇష్టమైన స్థలాలు

నిరంతర హోమధూమ సుగంధాలతో, వేద నాదాలతో నిండిన ఆశ్రమాన్ని చూసి పెద్దమ్మ దుఃఖిస్తూ ''ఓ ఉద్దాలకా! నాకు ఈ చోటు సరిపడదు. వేదాలు ధ్వనించే, అతిథి పూజా సత్కారాలు జరిగే, యజ్ఞయాగాదులు నిర్వహించే స్థలాల్లో నేను నివసించను. అన్యోన్య అనురాగం గల భార్యాభర్తలు ఉన్న చోటగానీ, పితృదేవతలు పూజింపబడే చోటగానీ, ఉద్యోగస్తుడు, నీతివేత్త, ధర్మిష్టుడు, ప్రేమగా మాట్లాడేవాడూ, గురుపూజా దురంధరుడు ఉండే స్థలాల్లో నేను ఉండను. ఎక్కడ రాత్రింబవళ్ళు ఆలుమగలు దెబ్బలాడుకుంటూ ఉంటారో ఏ ఇంట్లో అతిథులు నిరాశతో ఉసూరుమంటారో, ఎక్కడయితే వృద్ధులకు, మిత్రులకు, సజ్జనులకు అవమానాలు జరుగుతుంటాయో, ఎక్కడయితే దురాచారాలు, పరద్రవ్య, పరభార్యాపహరణ శీలులైనవారు ఉంటారో అలాంటి చోట మాత్రమే నేనుంటాను. కల్లు తాగేవాళ్ళు, గోహత్యలు చేసేవాళ్ళు, బ్రహ్మహత్యాది పాతకులు ఎక్కడ ఉంటారో నేనక్కడ ఉండటానికే ఇష్టపడతాను'' అంది.

* రావి మొదట్లో జ్యేష్ఠావాసం

ఆమె మాటలకు వేదవిదుడైన ఉద్దాలకుడు కించిత్తు నొచ్చుకుని ''ఓ జ్యేష్ఠా! నువ్వు కోరినట్లుగా నీకు తగిన నివాస స్థానాన్ని అన్వేషించి వస్తాను. అంతవరకూ నువ్వీ రావిచెట్టు మొదట్లోనే కదలకుండా కోర్చో'' అని చెప్పి బయల్దేరి వెళ్ళాడు. భర్తాజ్ఞ ప్రకారం జ్యేష్ఠాదేవి రావిచెట్టు మొదలులో అలాగే ఉండిపోయింది. ఎన్నాళ్ళకీ ఉద్దాలకుడు రాకపోవడంతో పతి విరహాన్ని భరించలేని పెద్దమ్మ పెద్దపెట్టున దుఃఖించసాగింది. ఆమె రోదనలు వైకుంఠంలో ఉన్న లక్ష్మీనారాయణుల చెవుల్లో పడ్డాయి. వెంటనే లక్ష్మి తన అక్కగారిని ఊరడించవలసిందిగా విష్ణువును కోరింది. విష్ణువు కమలా సమేతుడై జ్యేష్ఠాదేవి ఎదుట ప్రత్యక్షమై, ఆమెని ఊరడిస్తూ ''ఓ జ్యేష్ఠాదేవీ! ఈ రావిచెట్టు నా అంశతో కూడి ఉంటుంది. కనుక, నువ్వు దీని మూలంలోనే స్థిరనివాసం ఏర్పరచుకుని ఉండిపో. ప్రతి ఏటా నిన్ను పూజించే గృహస్తుల యందు లక్ష్మి నివసిస్తూ ఉంటుంది'' అని చెప్పాడు.

ఆ నియమాలలోనే ప్రతి శనివారం రావిచెట్టు పూజనీయగాను, అక్కడ జ్యేష్ఠాదేవిని షోడశోపచార విధిని అర్పించే స్త్రీల పట్ల శ్రీదేవి అమిత కరుణ కురిపించేట్లు ఏర్పరచాడు శ్రీహరి. ''ఓ ఋషులారా! సత్యభామకు శ్రీకృష్ణుడు, పృథుచక్రవర్తికి నారదుడు చెప్పినట్లు నేను మీకు ఈ పద్మపురాణ అంతర్గత కార్తీక పురాణాన్ని వినిపించాను. ఎవరయితే ఈ కార్తీక మహత్యాన్ని చదువుతున్నారో, వింటున్నారో, వినిపిస్తున్నారో వారు సమస్త పాపాల నుండి విడివడి విష్ణు సాయుజ్యాన్ని పొందుతున్నారు'' అని సూతుడు చెప్పగా విని సంతసించిన ఋషులు అక్కడినుంచి బద్రీవన దర్శన కాంక్షులై పయనమయ్యారు.

No comments:

Post a Comment